భారీ వర్షాలు.. హైదరాబాద్ ముంపుపై నెటిజన్లు ఫైర్

by Rajesh |
భారీ వర్షాలు.. హైదరాబాద్ ముంపుపై నెటిజన్లు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దంచికొడుతున్న వానలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో నగర ప్రజలు నగరాన్ని కుదిపేస్తున్న వేళ హైదరాబాద్ లో తలెత్తిన ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇదేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున స్థలాల కబ్జాలను ప్రోత్సహించిందని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కబ్జా పెట్టి అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాల్సిన ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పేరుతో అనుమతులు ఇచ్చిందని దీని వల్ల నగరంలోని అనేక ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలిశాయని ఆరోపిస్తున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు నగరం మునిగిపోవడానికి ప్రధాన కారణం ఇదే అని కామెంట్స్ పెడుతున్నారు.

అధికార పార్టీ నేతలకే మేలు

భూముల రెగ్యులరైజేషన్ కోసం సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 59 సామాన్యుల కంటే అధికార పార్టీ లీడర్లకే ఎక్కువ మేలు చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ తీరుతో అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సైతం కుండబద్దలు కొట్టింది. స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 59 పేదల కోసం కాదని అది పెద్దల కోసం తీసుకువచ్చిన జీవో అని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్‌ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిపై ప్రభుత్వం మాత్రం పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఏయే ప్రాంతాల్లో ఎంత భూమిని క్రమబద్దీకరించామనే వివరాల రహస్యంగా ఉంచుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే ఇక హైదరాబాద్ ఎన్నటికి విశ్వనగరం అవుతుందనే సందేహాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Read More : వరంగల్‌లో వరద కన్నీరు.. ఫొటో ఫీచర్

Next Story

Most Viewed